ప్రపంచ దేశాల ప్రయోగాలు సరే.. చంద్రుడిపై హక్కులు ఎవరివి?

  • కొన్ని దశాబ్దాలుగా చంద్రుడిపై వరుస పరిశోధనలు
  • అక్కడేవైనా ఖనిజాలు, వనరులు దొరికితే హక్కులు ఎవరివనే చర్చ
  • 1966, 1984, 2020లో పలు ఒప్పందాలు
కొన్ని దశాబ్దాలుగా చంద్రుడిపై వరుస పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో అమెరికా వాళ్లు కాళ్లు మోపారు. ఇటీవల రష్యా ప్రయోగం విఫలమైన చోట.. మన చంద్రయానం సఫలీకృతమైంది. భవిష్యత్తులో జాబిల్లిపైకి మనుషులు వెళ్లే పరిస్థితులు రావచ్చు. అక్కడేవైనా ఖనిజాలు, వనరులు లేదా ఇతర విషయాల గురించిన కీలక సమాచారం దొరకవచ్చు. అప్పుడు వాటిపై హక్కులు ఎవరికి దక్కుతాయి? దీనిపై ఏవైనా ఒప్పందాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి.

అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి 1966లోనే ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ని తీసుకొచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం చందమామ, ఇతర ఖగోల వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసమే ఖగోళ అన్వేషణ జరగాలి. అయితే చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా? అనే దానిపై స్పష్టతలేదు. 

దీన్ని అనుసరిస్తూ 1979లో మూన్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. చందమామ, అక్కడి సహజ వనరులు మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లో అమలులోకి వచ్చింది. అయితే చందమామపై ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. 

2020లో అమెరికా ఆర్టెమిస్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ఉద్దేశం. ఇందులో కెనడా, జపాన్, ఐరోపా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో భారత్ కూడా చేరడం గమనార్హం.

Chandrayaan-3
moon
united nations
USA
China
moon resources

More Telugu News